వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి
వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి: మేయర్ దర్ని మధుకర్
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 9, 33వ డివిజన్లలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 'డ్రై డే - ఫ్రై డే' కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేయర్ శ్రీ దర్ని మధుకర్ గారు ముఖ్య అతిథిగా హాజరై, డివిజన్లలోని నీరు నిల్వ ఉండే పలు ప్రాంతాలను పరిశీలించారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకునే జాగ్రత్తలపై ఆయన ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గారితో పాటు జిల్లా వైద్యాధికారి (DMHO), వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, స్థానిక కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ప్రస్తుత వర్షాకాలం దృష్ట్యా ఇంటి పరిసరాల్లో ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా ప్రజలు తమ వంతు బాధ్యతగా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. చెత్తను ఆరుబయట వేయకుండా, ఇంటింటికీ వచ్చే మున్సిపల్ చెత్త సేకరణ సిబ్బందికి అందించి పూర్తిగా సహకరించాలని కోరారు. పరిసరాల పరిశుభ్రతను పాటించడం ద్వారా దోమల వృద్ధిని అరికట్టి, డెంగ్యూ, మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు