ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
న్యూఢిల్లీ: ఆదిలాబాద్లో భారత వాయు సేన (ఐఏఎఫ్) ఆధ్వర్యంలో నిర్మించనున్న ఎయిర్పోర్ట్ను అన్ని ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కోరారు. ఢిల్లీలోని కర్తవ్య భవన్లో జరిగిన భేటీలో ఈ అంశంపై చర్చించారు.
ఈ సందర్భంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూములు బదలాయించినందుకు రక్షణ మంత్రికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి అవసరమైన భూసేకరణ, యుటిలిటీల బదలాయింపు వంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని వెల్లడించారు.
దేశ భద్రత, సమగ్రతకు కీలకమైన ఈ ప్రాజెక్టును విస్తృత స్థాయిలో అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని సీఎం తెలిపారు. వాయు సేన టెర్మినల్తో పాటు పౌర విమానయాన శాఖ టెర్మినల్ భవనం, కార్గో, మెయింటెనెన్స్-రిపేర్-ఓవర్హాల్ (ఎంఆర్ఓ), విమానాల నిల్వ కేంద్రాలు (హ్యాంగర్లు) ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు.
అంతర్జాతీయ విమానయాన సంస్థలు తమ విమానాల నిల్వ కేంద్రాల ఏర్పాటుకు అనుకూల ప్రాంతాలను అన్వేషిస్తున్న నేపథ్యంలో, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ను ఆ దిశగా అభివృద్ధి చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
అలాగే, రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) ప్రతిపాదించిన కీలక ప్రాజెక్టును మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర సమీపంలో త్వరగా మంజూరు చేయాలని రక్షణ మంత్రిని కోరారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.