ఆధార్ భద్రతకు ఏఐ కవచం మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త సాంకేతికత
న్యూఢిల్లీ: ఆధార్ వినియోగదారులకు కీలకమైన భద్రతా సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ఆధార్ ఆధారిత సేవల్లో జరిగే మోసాలను ముందుగానే గుర్తించి అడ్డుకునేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ అధునాతన కృత్రిమ మేధ సాంకేతికతను వినియోగించనుంది. నకిలీ వేలిముద్రలు, నకిలీ ముఖచిత్రాలు, ఇతర కృత్రిమ జీవసంబంధ గుర్తింపుల ద్వారా జరిగే మోసాలను గుర్తించేలా భద్రతా వ్యవస్థలను మరింత పటిష్ఠం చేస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రోజుకు 10 కోట్లకు పైగా ఆధార్ ధ్రువీకరణలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఈ సంఖ్య 25 నుంచి 30 కోట్లకు చేరుకునే అవకాశం ఉండటంతో, అందుకు అనుగుణంగా సాంకేతిక మౌలిక వసతులను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా ఇటీవల నిర్వహించిన ప్రపంచ ఆర్థిక సాంకేతిక సదస్సులో ఆధార్ ముఖ ధ్రువీకరణ సాంకేతిక సాధనం, పరీక్షా వేదికను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటి ద్వారా వివిధ అనువర్తనాల్లోనే సురక్షితమైన ముఖ ధ్రువీకరణను నిర్వహించే అవకాశం ఉంటుంది. కృత్రిమ మేధ ఆధారిత వ్యక్తి సజీవంగా ఉన్నాడా లేదా అన్నది నిర్ధారించే పరీక్షతో పాటు, నకిలీ ముఖచిత్రాలు లేదా ఇతర కృత్రిమ పద్ధతుల ద్వారా మోసాలకు పాల్పడే ప్రయత్నాలను గుర్తించి అడ్డుకునే రక్షణ వ్యవస్థలు కూడా ఇందులో ఉంటాయి. ఆధార్ ఆధారిత సేవల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, ధ్రువీకరణ ప్రక్రియను మరింత సురక్షితంగా, వేగంగా మార్చడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.