ఆధార్ నంబర్తోనే ఎరువుల కేటాయింపు.. రైతులకు మరింత సులభతరం ఏవో బి శివశంకర్
చాట్రాయి మండల రిపోర్టర్ గోళ్ళ సత్యనారాయణ
చాట్రాయి, జూలై 2: రైతులకు ఎరువుల పంపిణీలో పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఏపీ ఎయిమ్స్ (APAIMS) 2.0 విధానం రైతులకు ఎంతో ఉపయోగకరంగా మారుతోందని మండల వ్యవసాయ అధికారి శివశంకర్ తెలిపారు. గురువారం మధ్యాహ్నం చాట్రాయి మండలంలోని నరసింహారావుపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (ప్యాక్స్)ను ఆయన సందర్శించి యూరియా, డీఏపీ ఎరువుల పంపిణీ ప్రక్రియను పరిశీలించారు.
ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన శివశంకర్, ఆధార్ నంబర్ నమోదు చేసి ఓటీపీ ధ్రువీకరణ పూర్తి చేసిన వెంటనే రైతులు తమ పంట విస్తీర్ణం, పంట రకం ఆధారంగా ప్రభుత్వం కేటాయించిన ఎరువుల వివరాలను నేరుగా తెలుసుకునే అవకాశం ఉందన్నారు. దఫాల వారీగా ఎంత డీఏపీ, ఎంత యూరియా కేటాయించబడిందో వెబ్సైట్లో స్పష్టంగా కనిపిస్తుందని, దీంతో ఎరువుల కోసం రైతులు అనవసరంగా తిరిగే పరిస్థితి ఉండదని పేర్కొన్నారు.
ప్రత్యేకంగా కౌలు రైతులు, వెబ్ల్యాండ్లో నమోదు కాని భూములను సాగు చేస్తున్న రైతులు, ఇంకా పట్టాదారు పాస్బుక్ పొందని సాగుదారులకు కూడా ఈ విధానం ద్వారా ఎరువులు అందుబాటులోకి రావడం ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనమని ఆయన తెలిపారు. రైతులు తమ సమీప రైతు సేవా కేంద్రాలను సంప్రదించి పంటల వివరాలను తప్పనిసరిగా పరిశీలించుకోవాలని, వివరాల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే గ్రామ వ్యవసాయ, ఉద్యానవన సహాయక అధికారుల ద్వారా వెంటనే సవరించుకోవచ్చని సూచించారు.
రైతులకు సకాలంలో ఎరువులు అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని, ప్రతి రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి శివశంకర్ పిలుపునిచ్చారు.