పినపాకలో రీసర్వే విజయగాథ.. రైతుల చేతికి సరికొత్త డిజిటల్ పట్టాదారు పాసుపుస్తకాలు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ చేతుల మీదుగా పంపిణీ
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జీ.కొండూరు, ఎన్నో ఏళ్లుగా భూ సరిహద్దు వివాదాలు, రికార్డుల సమస్యలతో ఇబ్బందులు పడుతున్న పినపాక గ్రామ రైతులకు శాశ్వత భూ హక్కు కల్పించే దిశగా చేపట్టిన రీసర్వే ప్రక్రియ విజయవంతంగా పూర్తైంది. ఈ నేపథ్యంలో సిద్ధమైన సరికొత్త డిజిటల్ పట్టాదారు పాసుపుస్తకాలను మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ గురువారం రైతులకు పంపిణీ చేశారు.
పినపాక గ్రామానికి మొత్తం 372 డిజిటల్ పాసుపుస్తకాలు మంజూరు కాగా, పంపిణీ ప్రారంభమైన తొలిరోజే సగానికి పైగా రైతులు తమ పాసుపుస్తకాలను అందుకోవడం విశేషంగా నిలిచింది. కొత్త పాసుపుస్తకాలతో తమ భూములకు శాశ్వత రక్షణ లభించిందనే ఆనందాన్ని రైతులు వ్యక్తం చేశారు.
సిబ్బంది అహర్నిశల శ్రమకు ఫలితం
పినపాకలో రీసర్వే ప్రక్రియ సాఫీగా సాగడం వెనుక రెవెన్యూ, సర్వే శాఖల అధికారులు, సిబ్బంది చేసిన కృషి కీలకంగా నిలిచింది. గ్రామంలోని ప్రతి సర్వే నంబరును క్షుణ్ణంగా పరిశీలిస్తూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, డ్రోన్ సర్వే సహకారంతో భూ రికార్డులను సరిచేశారు. సరిహద్దు వివాదాలు, రికార్డుల వ్యత్యాసాలను పరిష్కరిస్తూ మండల, గ్రామ సర్వేయర్లు, గ్రామ రెవెన్యూ సిబ్బంది సమిష్టిగా పనిచేశారు.
ఎండనక, వాననక పొలాల్లో తిరుగుతూ రైతుల సమస్యలను వినిపించుకుని, చిన్నపాటి పొరపాట్లకు కూడా తావులేకుండా రికార్డులను ఖరారు చేయడం ద్వారా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సిబ్బంది కృషిని స్థానిక రైతులు ప్రత్యేకంగా అభినందించారు.
రైతుల్లో ఆనందం
సరిహద్దు గొడవలకు ముగింపు పలుకుతూ పక్కా కొలతలతో కూడిన డిజిటల్ పట్టాదారు పాసుపుస్తకాలు అందుకోవడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. భూమికి పూర్తి భద్రత లభించడంతో పాటు బ్యాంకు రుణాలు, ఇతర రెవెన్యూ సేవలు సులభతరం అవుతాయని రైతులు పేర్కొన్నారు. అత్యంత పారదర్శకంగా, అవినీతికి తావులేకుండా పంపిణీ జరగడం పట్ల గ్రామంలో సంతృప్తి వ్యక్తమవుతోంది.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్తో పాటు మండల తహశీల్దార్ రిబ్కా రాణి, గ్రామ రెవెన్యూ అధికారి సింహాద్రి, గ్రామ సర్వేయర్లు, మండల సర్వేయర్లు, ఇతర రెవెన్యూ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, రైతులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.