వి బి జి రామ్ జీ ఉపాధి హామీ పథకం ప్రారంభోత్సవం.. చాట్రాయి మండలం చనుబండ శివారులో కార్యక్రమం
చాట్రాయి మండలం చనుబండ శివారు సూరమ్మ చెరువు వద్ద “వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ)” ఉపాధి హామీ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఏలూరు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు శ్రీకర్ బుర్రి, మాజీ ఎంపీపీ కందుల కృష్ణ పాల్గొన్నారు.
శ్రీకర్ బుర్రి మాట్లాడుతూ, వి బి జి రామ్ జీ (వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ) పథకం 2026 జూలై 1 నుండి అమల్లోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వ గ్రామీణ ఉపాధి హామీ కార్యక్రమమని తెలిపారు. గతంలో ఉన్న ఎంజీఎన్ఆర్ఈజీఏ స్థానంలో ఈ పథకం అమలులోకి వచ్చిందని పేర్కొన్నారు.
గ్రామీణ కుటుంబాలకు సంవత్సరానికి 100 రోజులుగా ఉన్న ఉపాధి పనిదినాలను 125 రోజులకు పెంచినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా కనీస రోజువారీ కూలీగా రూ.307 నిర్ణయించగా, రాష్ట్రాల వారీగా అదనంగా పెరిగే అవకాశం ఉందని చెప్పారు.
ఈ పథకం ద్వారా నీటి సంరక్షణ పనులు, చెరువులు–కాలువల అభివృద్ధి, గ్రామీణ రహదారులు, వ్యవసాయ అనుబంధ పనులు, మామిడి–కొబ్బరి–పామాయిల్ వంటి మొక్కల నాట్లు, డ్రైనేజీ వ్యవస్థల అభివృద్ధి, రోడ్ల ప్రక్కల పొదలు తొలగింపు, పంట కాలువల మరమ్మతులు, స్మశానాల శుభ్రత వంటి పనులు చేపట్టవచ్చని వివరించారు.
కూలీల వేతనం ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతాల్లో డీబీటీ విధానంలో నేరుగా జమ అవుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం వాటా భరిస్తాయని పేర్కొన్నారు.
మాజీ ఎంపీపీ కందుల కృష్ణ మాట్లాడుతూ, 18 సంవత్సరాలు పైబడిన గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి పనులు పొందే అర్హత ఉందని తెలిపారు. 7 నుంచి 15 రోజులలో కూలీ చెల్లింపులు బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోడీ సూచనల మేరకు పెంచిన పని దినాలు, వేతనాలను సద్వినియోగం చేసుకోవాలని, రైతులు కూడా అవసరమైన వ్యవసాయ పనులకు ఉపాధి కూలీలను వినియోగించి ఉపాధి అవకాశాలు పెంచాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అంబుడ్స్మెన్ బాజీ, చిలక వెంకటేశ్వరరావు, జక్కం సంజీవరావు, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.