వికసిత్ భారత్–జీ రామ్ జీ 125 రోజుల గ్రామీణ ఉపాధి పథకానికి శ్రీకారం
పోలిశెట్టిపాడులో ప్రారంభ కార్యక్రమం ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం, ఏ.కొండూరు మండలం పోలిశెట్టిపాడు గ్రామంలో "వికసిత్ భారత్–జీ రామ్ జీ 125 రోజుల గ్రామీణ ఉపాధి మెరుగైన పథకం" ప్రారంభ కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ వాసం మునియ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను మరింత విస్తరించి, నిరుద్యోగులకు స్థిరమైన జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. గ్రామీణ పేద కుటుంబాల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఈ దిశగా జీ రామ్ జీ 125 రోజుల ఉపాధి పథకం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలు పూర్తి అవగాహన పెంచుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. గ్రామాల అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని, ఉపాధి హామీ కార్యక్రమాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏ.కొండూరు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి గోగులమూడి రామ్ ప్రసాద్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.