ఆగిరిపల్లి: పాఠశాల ఆయాల బకాయి వేతనాల కోసం ధర్నా..
ఆగిరిపల్లి: పాఠశాల ఆయాల బకాయి వేతనాల కోసం ధర్నా.. వెంటనే చెల్లించాలని డిమాండ్
ఆగిరిపల్లి, ఆగస్టు 27:
ఏలూరు జిల్లా నూజివీడు డివిజన్ ఆగిరిపల్లి మండల విద్యాశాఖ కార్యాలయం వద్ద పాఠశాల శానిటేషన్ కార్మికులు (ఆయాలు) తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేపట్టారు. అఖిలభారత స్కీమ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో 6 నెలలు, 3 నెలలుగా పెండింగ్లో ఉన్న వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఏఐసీటీయూ జిల్లా కార్యదర్శి వేముల బక్కయ్య మాట్లాడుతూ.. 23 సంవత్సరాలకు పైగా పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న శానిటేషన్ కార్మికులు అతి తక్కువ వేతనాలతో, కనీస మెనూ చార్జీలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతున్నా పాలకులు కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.
స్కీమ్ వర్కర్లకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు అమలు చేయాలని, మండలానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తున్న స్మార్ట్ కిచెన్ కేంద్రాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వీటి వల్ల కార్మికుల జీవనోపాధికి నష్టం కలుగుతోందని పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రూ.42 వేల వేతనాలు చెల్లించాలని, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, స్కీమ్ వర్కర్లందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. ప్రతి కార్మికుడికి రూ.5 లక్షల ఆరోగ్య బీమా కల్పించాలని, ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించాలని, 12 నెలల వేతనాలు, గ్రాట్యుటీ, నెలకు రెండు సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే రాజకీయ వేధింపులు, కక్ష సాధింపులు నిలిపివేయాలని, కార్మికుల నియామక పరిధి నుంచి పేరెంట్స్ కమిటీలను తొలగించాలని కోరారు. పరిశ్రమ నిర్వచనంపై కార్పొరేట్లకు అనుకూలంగా చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
అనంతరం మండల విద్యాశాఖ అధికారి ఆనందకుమార్కు వినతిపత్రం అందించారు. దీనిపై ఎంఈఓ మాట్లాడుతూ వేతనాల బిల్లులను ప్రభుత్వానికి పంపించామని, త్వరలోనే నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని తెలిపారు.
కార్యక్రమంలో ఏఐసీటీయూ సభ్యులు పల్లెపాము భవాని, స్కీమ్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షురాలు కలపాల రాణి, మేకల రాములమ్మ, జలసూత్రం అనసూర్య, పి. కిరణ్ కుమారి, జె. రాధామణి, బొకిరాల వజ్రం, కే. రాణి, కూరపాటి గంగ, నల్లపోతు మేరమ్మ, టి. సక్కుబాయమ్మ, పత్తిపాటి సారమ్మ, పి. రమా, ట్రాన్సస్ అమ్మ, లత తదితరులు పాల్గొన్నారు.