చిలకలూరిపేటలో హైటెన్షన్.. మృతుల కుటుంబాల ఆందోళన బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం అందలేదని నిరసన
చిలకలూరిపేటలో నిన్న రాత్రి జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మృతి చెందిన ఏడుగురి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఆటోలో ప్రయాణిస్తున్న వారిని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ఏడుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం అందలేదని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. టీడీపీ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు స్వయంగా తమ వద్దకు వచ్చి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే తమ వద్దకు రాకపోతే మృతదేహాలతో ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించబోమని స్పష్టం చేశారు.
మృతుల కుటుంబాల ఆందోళన నేపథ్యంలో చిలకలూరిపేట ఎన్ఆర్టీ సెంటర్లో పోలీసులు భారీగా మోహరించారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.