తిరువూరు డిపోలో ప్రయాణికుల పాట్లు.. కాలం చెల్లిన బస్సులతో నిత్యం ఇబ్బందులు
తిరువూరు ఆర్టీసీ డిపోపై ప్రయాణికుల ఆగ్రహం.. బస్సుల నిర్వహణపై తీవ్ర విమర్శలు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం:
తిరువూరు ఆర్టీసీ డిపో నుంచి నడుస్తున్న బస్సు సర్వీసుల్లో ప్రయాణికుల అవస్థలు కొనసాగుతున్నాయి. కాలం చెల్లిన బస్సులు తరచూ మార్గమధ్యలోనే మొరాయిస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
డిపో నుంచి వెళ్లే పలు బస్సులు సమయపాలన పాటించకపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం కురిసిన సమయంలో బస్సుల లోపలికి నీరు చేరడంతో ప్రయాణం నరకప్రాయంగా మారుతోందని వాపోతున్నారు.
తాజాగా తిరువూరు నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు వైఫర్ పనిచేయక ఇబ్రహీంపట్నం వద్ద నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులను మరో బస్సులో విజయవాడకు తరలించారు.
ఇటీవల మరమ్మతుల పేరుతో ఏసీ ఇంద్ర బస్సు సర్వీసును రద్దు చేయడంతో ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమస్యలపై ఫిర్యాదులు చేసినా ఆర్టీసీ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
తిరువూరు డిపో అధికారుల నిర్లక్ష్య వైఖరిపై ప్రయాణికులు మండిపడుతున్నారు. కాలం చెల్లిన బస్సులను వెంటనే తొలగించి, కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. తిరువూరు డిపో సమస్యలపై ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.