ఆగిరిపల్లిలో పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ
జిల్లాలో 2.55 లక్షల మందికి రూ.112.49 కోట్ల పంపిణీ.. మంత్రి కొలుసు పార్థసారథి
ఏలూరు జిల్లా, ఆగిరిపల్లి, సెప్టెంబరు 1:
దేశంలోనే అత్యధికంగా సామాజిక పింఛన్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఏలూరు జిల్లాలో 2,55,107 మంది పింఛన్ లబ్ధిదారులకు రూ.112.49 కోట్ల పింఛన్ మొత్తాన్ని పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు.
ఆగిరిపల్లి మండలంలో 9,390 మంది లబ్ధిదారులకు రూ.4.12 కోట్ల పింఛన్లు, ఆగిరిపల్లి గ్రామంలో 1,420 మంది లబ్ధిదారులకు రూ.62.65 లక్షల పింఛన్లను అందిస్తున్నట్లు తెలిపారు.
మంగళవారం ఆగిరిపల్లి గ్రామంలో నిర్వహించిన ‘పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా’ సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఉదయం 7 గంటలకే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ మొత్తాలను అందజేశారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, కొన్ని సమస్యలను అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు.
ఈ సందర్భంగా గ్రామ మహిళలు, ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు మంత్రికి ఘన స్వాగతం పలికారు.
మంత్రి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లో వృద్ధులకు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు, కిడ్నీ తదితర వ్యాధులతో బాధపడుతున్న వారికి రూ.10 వేలు, మంచానికే పరిమితమైన వారికి రూ.15 వేల చొప్పున ఎన్టీఆర్ భరోసా ద్వారా సామాజిక పింఛన్లు అందిస్తున్నట్లు తెలిపారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ మొత్తాన్ని రూ.4 వేలకు పెంచి అమలు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి నెలా మొదటి తేదీనే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు అందిస్తున్నామని, మొదటి తేదీ సెలవు రోజు వస్తే ముందుగానే పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
పేదల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అన్నారు. ఇతర రాష్ట్రాల్లో సాధారణంగా రూ.600 నుంచి రూ.2 వేల వరకు మాత్రమే సామాజిక పింఛన్లు ఉంటే, ఆంధ్రప్రదేశ్లో అర్హతలను బట్టి రూ.4 వేల నుంచి రూ.15 వేల వరకు అందిస్తున్నామని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి తొలి విడతగా 80 వేల ఇళ్లు త్వరలో మంజూరు కానున్నాయని, గ్రామీణ ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తామని మంత్రి వెల్లడించారు. అర్హులైన వారికి మరిన్ని పింఛన్లు మంజూరు చేసే అంశంపై ప్రభుత్వం ఆలోచన చేస్తోందని తెలిపారు.