నూజివీడు: నవోదయం–2.0లో పాత నేరస్తుడిపై బైండ్ ఓవర్ చర్యలు
నాటు సారా రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవోదయం–2.0 కార్యక్రమంలో భాగంగా నూజివీడు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
ఏలూరు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ బి. శ్రీలత, జిల్లా అసిస్టెంట్ కమిషనర్ నాగ ప్రభు కుమార్, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి అవులయ్య ఆదేశాల మేరకు నూజివీడు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో అక్రమ మద్యం నియంత్రణకు చర్యలు ముమ్మరం చేశారు.
ఈ క్రమంలో చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన భూక్యా వర ప్రసాద్ నాయక్, తండ్రి వెంకటేష్ అనే పాత నేరస్తుడిని చాట్రాయి తహసీల్దార్, మండల కార్యనిర్వాహక మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి బైండ్ ఓవర్ చేశారు.
బైండ్ ఓవర్ కాలపరిమితి ఒక సంవత్సరం ఉంటుందని, ఈ కాలంలో తిరిగి ఎక్సైజ్ నేరాలకు పాల్పడితే నిబంధనల ప్రకారం రూ.లక్ష జరిమానా విధిస్తామని తహసీల్దార్ హెచ్చరించారు. అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం సంక్షేమ పథకాలపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.
ఆగిరిపల్లి, నూజివీడు, ముసునూరు, చాట్రాయి మండలాల పరిధిలో అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహించే వారిపై, నాటు సారా తయారీ, విక్రయం, నిల్వ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
నాటు సారా తయారీకి ఉపయోగించే బెల్లాన్ని అక్రమంగా సరఫరా చేసే వ్యాపారులు, బెల్లపు ఊటను తమ భూముల్లో నిల్వ ఉంచి సహకరించే భూ యజమానులపై కూడా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు.
నాటు సారా తయారీ, అక్రమ మద్యం కార్యకలాపాలను పూర్తిగా అరికట్టేందుకు నూజివీడు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నిరంతర నిఘా, తనిఖీలు, ప్రత్యేక దాడులు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు.