విస్సన్నపేట కమ్మటూరు యాదవుల బజార్లో అధ్వానంగా రహదారి
తారు రోడ్డు కాస్తా మట్టి రోడ్డుగా మారడంతో ప్రజల అవస్థలు
డ్రైనేజీ ఏర్పాటు చేసి కొత్త రోడ్డు నిర్మించాలని సీపీఎం డిమాండ్
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట కమ్మటూరు యాదవుల బజార్లోని తారు రోడ్డు పూర్తిగా దెబ్బతిని మట్టి రోడ్డుగా మారడంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం విస్సన్నపేట మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీఎం విస్సన్నపేట మండల కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ విస్సన్నపేట గ్రామపంచాయతీ పరిధిలోని కమ్మటూరు యాదవుల బజార్లో సుమారు 30 సంవత్సరాల క్రితం తారు రోడ్డు నిర్మించారని తెలిపారు. రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగు నీరు రోడ్డుపైకి చేరి గుంతలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు.
పంచాయతీ అధికారులు డ్రైనేజీ పూడిక తీసిన మట్టిని రోడ్డుపైనే వేయడంతో పరిస్థితి మరింత దారుణంగా మారిందని, వర్షాల సమయంలో బురదతో ప్రజలు నడవలేని పరిస్థితి ఏర్పడుతోందని అన్నారు. రోడ్డుపై పేరుకుపోయిన బురద మట్టిని వెంటనే తొలగించి కొత్త రహదారి నిర్మించాలని, అలాగే రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
సమస్యను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ప్రజలను సమీకరించి అధికారుల కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని సీపీఎం విస్సన్నపేట పట్టణ కార్యదర్శి మేకల జ్ఞానరత్నం హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు వినుకొండ రంగా, రాణి, శ్రీను, రాము తదితరులు పాల్గొన్నారు.