కొండపర్వ ప్రధాన రహదారి మరమ్మతులకు వినతి.. వెంటనే పరిష్కరిస్తామని ఆర్డీఓ హామీ
ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట మండలం కొండపర్వ గ్రామం:
గ్రామంలోని ప్రధాన రహదారి అధ్వానంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గ్రామస్తులు తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కుమార్కు వినతిపత్రం సమర్పించారు.
కొండపర్వ గ్రామంలోని ప్రధాన రహదారి పూర్తిగా గోతులు, గుంటలతో నిండిపోయిందని, వాహనదారులు, పాదచారులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు వినతిలో పేర్కొన్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో గోతుల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో సమస్య మరింత తీవ్రంగా మారిందన్నారు. కనీసం మరమ్మతు పనులు కూడా చేపట్టకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
రహదారికి తక్షణమే మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని కోరుతూ గ్రామస్తులు ఆర్డీఓకు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కుమార్ సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే రహదారి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
సమస్యపై వెంటనే స్పందించిన ఆర్డీఓకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త బోట్ల శివ సత్యనారాయణ, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మూలుగుమటి శ్రీధర్, గ్రామస్తులు పామర్తి శ్రీరాములు, బొల్లికొండ శ్రీనివాసరావు, వేముల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.