మధిరలో ఉపాధ్యాయుల పోరుబాట..
మధిరలో ఉపాధ్యాయుల పోరుబాట.. పీఆర్సీ విడుదల, సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్
ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతోనే ఉద్యమం : పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. రంగారావు
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం మధిర:
పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు ఉద్యమ బాట పట్టారు.
హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద పీఆర్టీయూ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా ధర్నాకు మధిర, ఎర్రుపాలెం మండలాల నుంచి ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన ఈ ధర్నాకు ఖమ్మం జిల్లా శాఖ పిలుపు మేరకు ఉపాధ్యాయులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. రంగారావు మాట్లాడుతూ.. పీఆర్సీ గడువు ముగిసి మూడు సంవత్సరాలు కావస్తున్నా ప్రభుత్వం ఇప్పటివరకు విడుదల చేయలేదన్నారు. సీపీఎస్ను రద్దు చేస్తామని ఇచ్చిన హామీ కూడా అమలు కాలేదని పేర్కొన్నారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయడంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని విమర్శించారు.
ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతోనే పీఆర్టీయూ పోరుబాట పట్టిందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఖమ్మం జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు హైదరాబాద్ ధర్నాకు తరలివెళ్లారని జిల్లా సహాయ అధ్యక్షులు ఆర్. బ్రహ్మారెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. రంగారావు, జిల్లా సహాయ అధ్యక్షులు ఆర్. బ్రహ్మారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు సీహెచ్వీ రవికుమార్, కొమ్ము శ్రీనివాసరావు, ఎస్. సంగిరెడ్డి, వి. నాగరాజు, రాష్ట్ర బాధ్యులు డి. వెంకటేశ్వరరావు, మాజీ రాష్ట్ర బాధ్యులు ఎస్కే మదార్, మధిర మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చిలుకూరి సత్యనారాయణరెడ్డి, పోలే సుధాకర్, ఎర్రుపాలెం మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి. మదన్మోహన్ రెడ్డి, ఎం. బాబురావు పాల్గొన్నారు.
సీనియర్ నాయకులు కొలగాని ప్రసాదరావు, మండల బాధ్యులు ఎండీ జమీర్, కె. రాఘవరావు, కె. శాంతబాబు, తెల్లమేకల శ్రీనివాసరావు, నాగభూషణ్ రెడ్డి, లూక్య రామారావు, రెండు మండలాల కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.