ఏపీలో రైతులకు కొత్త నిబంధనలు..
ఏపీలో రైతులకు కొత్త నిబంధనలు.. ఎరువుల కొనుగోళ్లకు భూమి రికార్డుల అనుసంధానం
అమరావతి: రాష్ట్రంలోని రైతులకు ఎరువుల కొనుగోళ్లలో కీలక మార్పులు రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎరువుల సరఫరా వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చేందుకు కొత్త విధానాన్ని అమలు చేయనుంది. ఇకపై రైతులు కొనుగోలు చేసే ఎరువులను వారి భూమి వివరాలు, పంటల సాగు రికార్డులతో అనుసంధానం చేయనున్నారు.
కొత్త విధానం ప్రకారం ఐఎఫ్ఎంఎస్–అగ్రిస్టాక్ వ్యవస్థ ద్వారా రైతులు మొబైల్ యాప్లో ఎరువుల కోసం నమోదు చేసుకుంటే ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ జారీ అవుతుంది. రైతులు ఆ కోడ్ను ఎరువుల దుకాణంలో చూపించగా, వ్యాపారులు స్కాన్ చేసి రైతు భూమి వివరాలు, సాగు విస్తీర్ణం ఆధారంగా ఎరువులను అందించనున్నారు.
ఎరువుల రవాణాను జీపీఎస్ సాంకేతికతతో పర్యవేక్షించడం, సబ్సిడీ చెల్లింపులను డిజిటల్ విధానంలో ట్రాక్ చేయడం ద్వారా అక్రమ నిల్వలు, కృత్రిమ కొరత, సబ్సిడీ దుర్వినియోగాన్ని అరికట్టాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ విధానం అమల్లోకి వస్తే అవసరమైన రైతులకు మాత్రమే ఎరువులు అందడంతో పాటు, మార్కెట్లో పారదర్శకత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.