కంభంపాడు ప్రధాన రహదారిపై ఆక్రమణల పరిశీలన....
కంభంపాడు ప్రధాన రహదారిపై ఆక్రమణల పరిశీలన.. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత
కంభంపాడు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏ కొండూరు మండలం కంభంపాడు గ్రామంలోని ప్రధాన రహదారిపై నెలకొన్న ట్రాఫిక్ సమస్యలు, ఫుట్పాత్ ఆక్రమణలను తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఏ. కుమార్ మంగళవారం పరిశీలించారు.
గ్రామంలోని బస్ షెల్టర్, బస్సులు ఆగే ప్రాంతం, నాలుగు రోడ్ల కూడలి వద్ద వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్న అంశాలను ఆయన పరిశీలించారు. ఫుట్పాత్లపై వాహనాలు నిలిపివేయకుండా చర్యలు తీసుకోవాలని, ఆక్రమణలను వెంటనే తొలగించి పాదచారులకు మార్గం అందుబాటులో ఉండేలా చూడాలని ఏ కొండూరు పోలీసు సిబ్బంది, తహసీల్దార్కు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ బస్ షెల్టర్, బస్సులు నిలిచే ప్రాంతం, నాలుగు రోడ్ల కూడలి వద్ద ఆక్రమణల కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ప్రయాణికులు, పాదచారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అనంతరం రహదారి పక్కన ఉన్న వాహనదారులు, దుకాణాల యజమానులతో మాట్లాడి ఆక్రమణల తొలగింపునకు సహకరించాలని కోరారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా రహదారులను పరిశుభ్రంగా, సురక్షితంగా ఉంచాలని సూచించారు.