ఎక్స్పైరీ డేట్లను ట్యాంపర్ చేసి భారీ మోసం..
నవీ ముంబై: ఎక్స్పైరీ తేదీలను ట్యాంపర్ చేసి ఆహార ఉత్పత్తులను విక్రయిస్తున్న వ్యవహారాన్ని నవీ ముంబై ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) అధికారులు గుర్తించారు. సాధన ఎంటర్ప్రైజెస్లో నిర్వహించిన తనిఖీల్లో భారీగా ట్యాంపరింగ్ చేసిన ఆహార ఉత్పత్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఎక్స్పైరీ తేదీలను మార్చడంతో పాటు, కొన్ని ఉత్పత్తులపై తయారీకి సంబంధించిన పదార్థాలు, పోషకాల వివరాలను కూడా మార్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో మొత్తం రూ.5.75 కోట్ల విలువైన 4,142 కార్టన్ల ఆహార ఉత్పత్తులను సీజ్ చేసినట్లు సమాచారం.
సీజ్ చేసిన ఉత్పత్తుల్లో ప్రముఖ బ్రాండ్లకు చెందిన లేస్, కుర్కరే, బింగో, ఫన్ ఫ్లిప్స్, మ్యాగీ, రసోయ్, నార్, హెల్మన్స్, థమ్స్ అప్, లిమ్కా తదితర ఉత్పత్తులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
వినియోగదారుల ఆరోగ్యానికి ముప్పు కలిగించే విధంగా ఎక్స్పైరీ తేదీలను మార్చడం, ఉత్పత్తుల లేబుళ్లలో సమాచారాన్ని ట్యాంపర్ చేయడం తీవ్రమైన ఉల్లంఘనగా అధికారులు పేర్కొన్నారు. ఘటనపై మరింత దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు.
భారీ మొత్తంలో ఆహార ఉత్పత్తులు సీజ్ కావడంతో ఈ వ్యవహారం స్థానికంగా కలకలం రేపింది. సంబంధిత సంస్థపై చట్టపరమైన చర్యలకు అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.