70 వసంతాలు పూర్తి చేసుకున్న ఎల్ఐసీ
1956లో ప్రారంభమైన ప్రస్థానం.. నేటికీ బీమా రంగంలో అగ్రస్థానం
నేషనల్ | Ntoday News
దేశంలో బీమా పాలసీ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC). దేశ ఆర్థిక రంగంలో కీలక సంస్థగా కొనసాగుతున్న ఎల్ఐసీ తన ప్రస్థానంలో 70 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
1956 సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఎల్ఐసీ.. ఏడు దశాబ్దాలుగా కోట్లాది మంది ప్రజలకు బీమా సేవలను అందిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రైవేట్ బీమా సంస్థల నుంచి తీవ్ర పోటీ ఉన్నప్పటికీ మార్కెట్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.
2025–26 ఆర్థిక సంవత్సరంలో పాలసీల సంఖ్య పరంగా 65.16 శాతం మార్కెట్ వాటా, ఫస్ట్ ఇయర్ ప్రీమియం పరంగా 56.66 శాతం మార్కెట్ వాటాతో ఎల్ఐసీ అగ్రస్థానంలో నిలిచినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
అంతేకాకుండా ఎల్ఐసీ నిర్వహిస్తున్న ఆస్తుల విలువ (AUM) ఏకంగా రూ.57.29 లక్షల కోట్లకు చేరుకుంది. దేశవ్యాప్తంగా విస్తరించిన భారీ నెట్వర్క్, కోట్లాది పాలసీదారుల నమ్మకం, దీర్ఘకాలిక సేవలతో ఎల్ఐసీ భారత బీమా రంగంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
70 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న ఎల్ఐసీ.. భవిష్యత్తులోనూ ఆధునిక సాంకేతికత, డిజిటల్ సేవలను విస్తరిస్తూ మరింత మందికి బీమా రక్షణను అందించే దిశగా ముందుకు సాగుతోంది.