కూతురి చదువు కోసం.. చెప్పులు లేకుండానే పరుగెత్తి మారథాన్ విజేతగా నిలిచిన తల్లి
మహారాష్ట్రలోని బీడ్ జిల్లా అంబాజోగాయి ప్రాంతానికి చెందిన 47 ఏళ్ల రమాబాయి పట్టుదలకు, త్యాగానికి ప్రతీకగా నిలిచారు. భర్తను కోల్పోయిన ఆమె కూలి పనులు చేస్తూ ఇద్దరు పిల్లలను పోషిస్తున్నారు.
కూతురి చదువు కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రమాబాయి.. మారథాన్లో గెలిస్తే వచ్చే బహుమతి డబ్బు ఉపయోగపడుతుందని తెలుసుకున్నారు. వెంటనే అమృత్ దౌడ్ పేరుతో నిర్వహించిన మారథాన్లో పాల్గొన్నారు.
పరుగులో మధ్యలో ఆమె వేసుకున్న చెప్పులు తెగిపోయాయి. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. తెగిపోయిన చెప్పులను చేతిలో పట్టుకుని చెప్పులు లేకుండానే పరుగు కొనసాగించారు. చివరకు 3 కిలోమీటర్ల మారథాన్ను విజయవంతంగా పూర్తి చేసి రూ.3 వేల నగదు బహుమతిని అందుకున్నారు.
ఆ మొత్తం పెద్దది కాకపోయినా.. తన కూతురి చదువు ఫీజుకు ఎంతో ఉపయోగపడుతుందని రమాబాయి ఆనందం వ్యక్తం చేశారు. ఆమె మాటలు విన్న అక్కడున్న వారు భావోద్వేగానికి గురై రమాబాయి త్యాగాన్ని, పట్టుదలను అభినందించారు.
కుటుంబం కోసం ఓ తల్లి చేసిన ఈ పోరాటం అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది.