ఆగస్టు నుంచి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ
ఆగస్టు నుంచి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ
జులై 19: ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో ఆగస్టు 1 నుంచి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీకి పౌర సరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
సాధారణంగా ప్రతి నెల మొదటి 15 రోజుల వరకు మాత్రమే రేషన్ దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ జరుగుతుంది. అయితే ఈసారి మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేయనున్నందున ఆగస్టు నెల మొత్తం, అంటే 31 రోజుల పాటు రేషన్ దుకాణాలు తెరిచి ఉంచి పంపిణీ చేపట్టనున్నారు.
మూడు నెలల బియ్యం ఒకేసారి అందజేయనున్నందున ప్రతి రేషన్ కార్డుదారు మూడు నెలలకు సంబంధించిన బయోమెట్రిక్ ధృవీకరణ కోసం మూడుసార్లు వేలిముద్ర వేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.