ఆహార భద్రతా ఉల్లంఘనలపై కఠిన చర్యలు.. రూ.6.5 లక్షల జరిమానా విధించిన జేసీ విద్యాధరి
విశాఖపట్నంలో ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన కిరాణా హోల్సేల్ దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, వాటర్ ప్లాంట్లపై జాయింట్ కలెక్టర్ విద్యాధరి కఠిన చర్యలు తీసుకున్నారు. వివిధ ఉల్లంఘనలకు సంబంధించి మొత్తం రూ.6.5 లక్షల జరిమానా విధించడంతో పాటు, మరో వాటర్ ప్లాంట్ లైసెన్స్ను రద్దు చేశారు.
ఎఫ్ఎస్ఎస్ఏఐ 2006 చట్టం ప్రకారం విశాఖలోని 12 సంస్థలపై ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. నాణ్యత లేని ధాన్యాలు, పప్పులు, ఆహార పదార్థాల విక్రయం, కృత్రిమ రంగుల వినియోగం, చికెన్ లాలిపాప్, ఫ్రైల్లో నాసిరకం పదార్థాల వాడకం, గడువు ముగిసిన పానీయాలు, పాడైన ఆహార పదార్థాల విక్రయం వంటి అంశాలపై జేసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇకపై ఇలాంటి ఉల్లంఘనలు పునరావృతమైతే లైసెన్స్ రద్దు వంటి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కల్యాణ చక్రవర్తి, ఆహార భద్రతాధికారి జీవీ అప్పారావు నమోదు చేసిన కేసులను శుక్రవారం సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.