ఆంధ్రప్రదేశ్లో అక్టోబరు చివరికి స్థానిక ఎన్నికలు పూర్తి
హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం.. బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం తర్వాత ఎన్నికల ప్రక్రియ
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను అక్టోబరు చివరి నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు తెలిపారు.
ఓటర్ల జాబితా తయారీ, ఖరారు ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కోరినట్లు ఏజీ వివరించారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ (రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్) తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించిందని తెలిపారు.
రిజర్వేషన్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుని త్వరలో జీవో జారీ చేయనున్నట్లు కోర్టుకు వివరించారు. పూర్తి వివరాలను సమర్పించేందుకు మరింత సమయం కావాలని ఏజీ ధర్మాసనాన్ని కోరారు.
స్థానిక సంస్థల రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టమైన తీర్పు ఇచ్చిందని పిటిషనర్ తరఫు న్యాయవాది తాండవ యోగేష్ వాదనలు వినిపించారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, రిజర్వేషన్లు ఖరారు చేసే ముందు అన్ని అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది.
పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచాలని ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్, జస్టిస్ చల్లా గుణరంజన్లతో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
బీసీ జనగణన ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాతే స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేలా ఆదేశించాలని కోరుతూ ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు 2025లో హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు.
అలాగే రాష్ట్రంలోని 13,325 గ్రామ పంచాయతీలు, 123 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేలా ఆదేశించాలని కోరుతూ న్యాయవాది తాండవ యోగేష్ మరో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై హైకోర్టు విచారణ కొనసాగించింది.