ఆపరేషన్ ముస్కాన్ సమర్థవంతంగా అమలు చేయాలి
ఆపరేషన్ ముస్కాన్ సమర్థవంతంగా అమలు చేయాలి - జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు 'ఆపరేషన్ ముస్కాన్-XII' కార్యక్రమాన్ని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సమర్థవంతంగా అమలు చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో మంగళవారం అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య, డి.సి.పి. ఎ.భాస్కర్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్ లతో కలిసి ఆయన జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని హోటళ్లు, దాబాలు, ఇటుక బట్టీలు, వర్క్షాపులు, షాపింగ్ సముదాయాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టి వీధి బాలలు, బాల కార్మికులను తక్షణమే రక్షించాలన్నారు. రక్షించిన చిన్నారులకు వైద్య పరీక్షలు, కౌన్సిలింగ్ నిర్వహించి, పునరావాసం లేదా బాలల సంరక్షణ కేంద్రాలలో ఆశ్రయం కల్పించాలని స్పష్టం చేశారు. బాలలను పనిలో పెట్టుకునే యజమానులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే పోలీస్ శాఖ ద్వారా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు.
బాలల హక్కుల పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, ప్రతి రెస్క్యూ చర్యను పకడ్బందీగా నమోదు చేసి నివేదికలు సమర్పించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. గ్రామాలు, పట్టణాలలో విస్తృత అవగాహన సదస్సులు నిర్వహించి బాలల రక్షణపై ప్రజల్లో చైతన్యం తేవాలన్నారు. అనంతరం డి.సి.పి. ఎ.భాస్కర్ మాట్లాడుతూ.. బాలల అక్రమ రవాణా, దోపిడీపై ప్రత్యేక నిఘా ఉంచామని, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై రాజీ పడకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పోలీసు, కార్మిక, విద్యా, వైద్య ఆరోగ్య, రెవెన్యూ శాఖల అధికారులు, జిల్లా బాలల పరిరక్షణ యూనిట్, చైల్డ్ హెల్ప్లైన్ ప్రతినిధులు పాల్గొన్నారు