శివచరణ్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలి: బీసీ సమాజ్ డిమాండ్
శివచరణ్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలి: బీసీ సమాజ్ డిమాండ్
కుల అహంకారాన్ని కాంగ్రెస్ ప్రోత్సహిస్తోందా? : బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి నరెడ్ల శ్రీనివాస్ డిమాండ్
మంచిర్యాల, జూలై 14: యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు సభ్యురాలు, బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన వృద్ధురాలు ఈశ్వరమ్మ యాదవ్పై యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి చేసిన అవమానకర వ్యాఖ్యలను బీసీ సమాజ్ తీవ్రంగా ఖండించింది. మంచిర్యాలలో బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి నరెడ్ల శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడారు. కేవలం తన తండ్రి ఫోటో ఫ్లెక్సీలో లేదనే కారణంతో ఒక మహిళా ప్రజాప్రతినిధిని అవమానించడం కుల అహంకార చర్య అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి నమ్మకంతో ఒక బీసీ మహిళకు పదవి ఇస్తే, దానిని సహించలేక అవమానించడం బీసీల ఆత్మగౌరవంపై దాడి చేయడమేనన్నారు. ప్రజాస్వామ్యంలో పదవులు అర్హత వల్ల వస్తాయి తప్ప, కుటుంబ వారసత్వం వల్ల కాదని హితవు పలికారు.
శివచరణ్ రెడ్డిని వెంటనే పదవి నుంచి బర్తరఫ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నరెడ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ బీసీ వ్యతిరేక శక్తులకు అండగా నిలుస్తోందనే సంకేతం ప్రజల్లోకి వెళ్తుందని హెచ్చరించారు. ఈ ఘటనపై కాంగ్రెస్ అధిష్ఠానం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి బీసీలకు క్షమాపణ చెప్పాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాలను ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. బీసీల ఆత్మగౌరవాన్ని కించపరిచే వారిని ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు