నిబంధనల ప్రకారమే పోడు భూముల సమస్యల పరిష్కారం
నిబంధనల ప్రకారమే పోడు భూముల సమస్యల పరిష్కారం: మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల ప్రతినిధి (జులై 14): ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఆర్.ఓ.ఎఫ్.ఆర్. (ROFR) చట్టానికి లోబడి మాత్రమే పోడు భూముల సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ స్పష్టం చేశారు. మంగళవారం కోటపల్లి మండలం ఎడగట్ట గ్రామంలో నిబంధనలను అతిక్రమించి సాగు చేస్తున్న అటవీ భూములను జిల్లా అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, కోటపల్లి సి.ఐ. కృష్ణ, అటవీ డివిజనల్ అధికారి సర్వేశ్వర్ లతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అటవీ హక్కుల చట్టం ప్రకారం 2005కు ముందు సాగులో ఉండి, అర్హత కలిగిన గిరిజన రైతులకు మాత్రమే చట్టం వర్తిస్తుందని తెలిపారు. అలాగే గిరిజనేతరుల విషయానికి వస్తే, 2005 నాటికి మూడు తరాలుగా (75 సంవత్సరాలు) కాస్తులో ఉన్న వారికి మాత్రమే అవకాశం ఉంటుందని, 2005 సంవత్సరం తర్వాత నూతనంగా అటవీ భూములు సాగు చేస్తున్న వారు ఎట్టి పరిస్థితుల్లోనూ చట్ట పరిధిలోకి రారని స్పష్టం చేశారు.
అనర్హులు ఎవరూ కొత్తగా అటవీ భూములను ఆక్రమించి సాగు చేయకుండా, చట్ట నిబంధనలపై స్థానికులకు అర్థమయ్యేలా కౌన్సిలింగ్ ఇవ్వాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ భూములకు సంబంధించిన అధికారిక సరిహద్దు మ్యాప్ చెన్నూర్ అటవీ రేంజ్ కార్యాలయంలో అందుబాటులో ఉందని, ఏవైనా సందేహాలు ఉన్నవారు కార్యాలయానికి వెళ్లి మ్యాప్ ను పరిశీలించుకోవచ్చని సూచించారు. అటవీ భూముల పరిరక్షణకు స్థానికులు సహకరించాలని కోరారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలన కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు, పోలీసు సిబ్బంది మరియు సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు