మెడికల్ కాలేజీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
మెడికల్ కాలేజీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
- అడిషనల్ డైరెక్టర్కు సిఐటియు వినతి పత్రం
- కనీస వేతనం రూ.26,000 చెల్లించాలని డిమాండ్
హజీపూర్ (మంచిర్యాల జిల్లా):
మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలం గుడిపేటలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ శానిటేషన్, ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యలపై తెలంగాణ మెడికల్ & హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో మంగళవారం కాలేజీ అడిషనల్ డైరెక్టర్ తులసిదేవికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా వైద్యారోగ్య శాఖ పరిధిలోని వివిధ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న పేషెంట్ కేర్, శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బందికి పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ. 26,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. జీఓ నెం.60 ప్రకారం రూ. 15,600 వేతనం ఇవ్వాల్సి ఉండగా, ప్రస్తుతం సుమారు రూ. 11,000 మాత్రమే ఇస్తూ మిగిలిన మొత్తాన్ని పీఎఫ్, ఈఎస్ఐ యజమాని వాటా పేరిట కట్ చేస్తూ కాంట్రాక్టర్లు కమిషన్ల రూపంలో తింటున్నారని మండిపడ్డారు. జూన్ నెల నుండి వేతనాలు పెంచుతామని గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చడంలో నిర్లక్ష్యం వహించడం వల్లనే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నామని స్పష్టం చేశారు.
అన్యాయమైన ఔట్సోర్సింగ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి, ప్రభుత్వమే నేరుగా కార్మికులకు వేతనాలు చెల్లించాలని సిఐటియు నేతలు డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న జీతాలు, ఈపీఎఫ్, ఈఎస్ఐ డబ్బులను తక్షణమే కార్మికుల ఖాతాల్లో జమ చేయడంతో పాటు ప్రతి ఒక్కరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని, కాంట్రాక్ట్ ఏజెన్సీల వేధింపులను అరికట్టాలని కోరారు. అలాగే కార్మికులకు ప్రమాద బీమా, గ్రాట్యుటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్, కార్మిక శాఖ ఉత్తర్వుల ప్రకారం సెలవులు, యూనిఫామ్, రక్షణ పరికరాలతో పాటు ఆసుపత్రుల్లో ప్రత్యేక రెస్ట్ రూమ్లు, భోజన వసతి కల్పించాలని, లేనిపక్షంలో ఆందోళనలను మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు స్వర్ణలత, రమేష్, కవిత, స్వరూప, హీన, కిరణ్, నాగమణి, రేణుక, ప్రభాకర్, రమాదేవి, లక్ష్మి, శోభ, రమా, మానస, చందు తదితరులు పాల్గొన్నారు