ఆరేళ్ల తర్వాత మళ్లీ విద్యుత్ ఉత్పత్తి....
ఆరేళ్ల తర్వాత మళ్లీ విద్యుత్ ఉత్పత్తి.. నేడు శ్రీశైలం నాలుగో యూనిట్లో ట్రయల్ రన్
శ్రీశైలం, ఆగస్టు 10: శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలోని నాలుగో యూనిట్లో సోమవారం ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ట్రయల్ రన్ విజయవంతమైతే యూనిట్ను విద్యుత్ గ్రిడ్కు అనుసంధానం చేసి ఉత్పత్తిని ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టనున్నారు. దీంతో సుమారు ఆరేళ్ల విరామం తర్వాత ఈ యూనిట్లో మళ్లీ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కానుంది.
2020 ఆగస్టులో బ్యాటరీల మార్పు సమయంలో సంభవించిన షార్ట్సర్క్యూట్ కారణంగా శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో తొమ్మిది మంది ఉద్యోగులు మృతి చెందారు. ప్రమాదం అనంతరం నాలుగో యూనిట్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.
తాజాగా యూనిట్ పునరుద్ధరణ పనులు పూర్తికావడంతో ట్రయల్ రన్కు అధికారులు సిద్ధమయ్యారు. ట్రయల్ రన్ సందర్భంగా యంత్రాల పనితీరు, భద్రతా ప్రమాణాలు, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. అన్ని పరీక్షలు సంతృప్తికరంగా పూర్తయితే గ్రిడ్కు అనుసంధానం చేసి వాణిజ్యపరంగా విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం ఉంది.