ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తిని కాపాడిన మార్కాపురం పోలీసులు
మార్కాపురం జిల్లా: కుటుంబ సమస్యలతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న సమయంలో సకాలంలో స్పందించిన మార్కాపురం జిల్లా పోలీసులు అతని ప్రాణాలను కాపాడారు.
మార్కాపురం పట్టణానికి చెందిన బండి రామదాసు (35) సోమవారం సాయంత్రం తాను చనిపోతున్నానంటూ కుటుంబ సభ్యులు, స్నేహితులకు ఫోన్ చేసి చెప్పాడు. విషయం తెలుసుకున్న అతని స్నేహితుడు అద్దంకి మాధవ డయల్-112కు సమాచారం అందించాడు.
సమాచారం అందుకున్న వెంటనే మార్కాపురం డీఎస్పీ యు. నాగరాజు, సీఐ అల్తాఫ్ హుస్సేన్ ఆదేశాల మేరకు ఎస్సై వి. వేమన, సిబ్బంది ఐటీ కోర్ టీం సహాయంతో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి రామదాసు ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు.
రైల్వే ట్రాక్ సమీపానికి చేరుకున్న పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి అతడిని రక్షించారు. అనంతరం కౌన్సిలింగ్ నిర్వహించి మానసికంగా ధైర్యం చెప్పి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
సకాలంలో స్పందించి ప్రాణాలను కాపాడిన పోలీసు అధికారులకు, సిబ్బందికి రామదాసు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.