ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం
ఏలూరులో అక్రమ PDS మాఫియా బట్టబయలు
టీడీపీ నేతలే తమ కూటమి నాయకులు, అధికారులపై సంచలన ఆరోపణలు
ఏలూరు జిల్లాలో భారీ స్థాయిలో జరుగుతున్న అక్రమ పీడీఎస్ బియ్యం దందా వ్యవహారం రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. చింతలపూడి నియోజకవర్గంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోందని ఆరోపిస్తూ టీడీపీ నాయకులే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.
లింగపాలెం మండలం మఠంగూడెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు గంటా సాయి కృష్ణ సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివ కిషోర్కు ఫిర్యాదు చేశారు. చింతలపూడి, లింగపాలెం మండలాల్లో చాలాకాలంగా అక్రమ రేషన్ బియ్యం మాఫియా కొనసాగుతోందని ఆయన ఆరోపించారు.
ఫిర్యాదులో ప్రధానంగా వంగర సాయి దత్తు అనే వ్యక్తి అక్రమ రేషన్ బియ్యం రవాణాను నిర్వహిస్తున్నాడని, అతనికి టీడీపీ లింగపాలెం మండల అధ్యక్షుడు గరిమెళ్ల చలపతి సహకరిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే ధర్మాజిగూడెం ఎస్సైతో పాటు పలువురు రాజకీయ నాయకులు, ప్రభుత్వ శాఖల అధికారులు కూడా ఈ అక్రమాలకు అండగా నిలుస్తున్నారని ఆరోపించారు.
ఈ అక్రమాలను ప్రశ్నించినందుకు తనపై బెదిరింపులు వస్తున్నాయని, ఇటీవల తన ఇంటి వద్ద రెక్కీ కూడా నిర్వహించారని గంటా సాయి కృష్ణ తెలిపారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చినా స్పందించలేదని, “రేషన్ బియ్యం ఏమైనా డ్రగ్సా?” అంటూ తననే ఎదురు ప్రశ్నించారని ఆరోపించారు.
వంగర సాయి దత్తు నుంచి గరిమెళ్ల చలపతికి భారీ స్థాయిలో నగదు, ఆన్లైన్ లావాదేవీలు జరిగినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. అధికార పార్టీ ప్రభావాన్ని ఉపయోగించి కొందరు అధికారులను డబ్బులతో మేనేజ్ చేస్తూ అక్రమ రేషన్ దందా కొనసాగిస్తున్నారని ఆరోపించారు.
అక్రమ రేషన్ బియ్యం రవాణాపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, చింతలపూడి ప్రాంతంలో అక్రమ రేషన్ మాఫియాను పూర్తిగా అరికట్టాలని, తనకు రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీని గంటా సాయి కృష్ణ కోరారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు స్పందించిన జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివ కిషోర్ ఈ అంశంపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు సమాచారం.