ఏలూరు జిల్లాలో పెళ్లి పేరుతో ఘరానా మోసం.. 40 మంది మహిళల జీవితాలతో చెలగాటం!
ఏలూరు జిల్లా ముదినేపల్లి పోలీసుల అదుపులో అంతర్రాష్ట్ర మోసగాడు సాంబశివరావు చిక్కాడు. మాట్రిమోనియల్ వెబ్సైట్లను వేదికగా చేసుకుని తాను ప్రముఖ కంపెనీ సీఈవోనని నమ్మిస్తూ వివాహం పేరుతో మహిళలను మోసం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
నిందితుడు ఇప్పటికే సుమారు 40 మంది మహిళలను లక్ష్యంగా చేసుకుని భారీగా నగదు, బంగారం, విలువైన వస్తువులు కాజేసినట్లు దర్యాప్తులో తేలింది. పెళ్లి బాసికలు, రోల్డ్ గోల్డ్ ఆభరణాలతో నమ్మకం కల్పించి, అనంతరం 8 కాసుల బంగారం, కారు, ఏటీఎం కార్డులు సహా విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకునే పథకం అమలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ముదినేపల్లి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, అతడి వద్ద నుంచి బంగారం, కారు, ఏటీఎం కార్డులు తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరిన్ని బాధితులు ఉండే అవకాశం ఉన్నందున దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ కేసు వివరాలను ఏలూరు జిల్లా ఎస్పీ కె. శివ ప్రతాప్ కిషోర్ మీడియాకు వెల్లడించారు. వివాహ సంబంధాల కోసం మాట్రిమోనియల్ సైట్లను వినియోగించే వారు పూర్తి స్థాయిలో వ్యక్తుల వివరాలను ధృవీకరించుకున్న తర్వాతే ముందుకు వెళ్లాలని ఎస్పీ సూచించారు.