ఏలూరు లో 104వ మేడే – కార్మిక హక్కుల రక్షణకు ఐక్య ఉద్యమ పిలుపు
లేబర్ కోడ్స్ రద్దు చేయాలంటూ ఎర్రజెండా నీడలో ఏలూరు జిల్లాలో కార్మిక శక్తి ప్రదర్శన
ఏలూరు జిల్లా ఏరియా సమితి ఆధ్వర్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) మరియు ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ సంయుక్తంగా 104వ మేడేను వాడవాడలా ఘనంగా నిర్వహించారు. పార్టీ, సంఘ జెండాలు ఎగరేసి కార్మిక ఐక్యతను చాటారు.
ఈ సందర్భంగా సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ అమెరికా చికాగో హే మార్కెట్ పోరాటాల త్యాగాల స్ఫూర్తితో ప్రతి సంవత్సరం మే 1న ప్రపంచవ్యాప్తంగా మేడే జరుపుకుంటారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలతో 8 గంటల పని విధానాన్ని మార్చి 10–12 గంటల శ్రమకు దారి తీసే చట్టాలు తెస్తున్నాయని విమర్శించారు. లేబర్ కోడ్స్ రద్దు చేసే వరకు పోరాటం కొనసాగాలని పిలుపునిచ్చారు.
సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మేడే ప్రపంచ శ్రామికుల ఐక్యతకు ప్రతీక అని, హక్కుల సాధన కోసం సమష్టి పోరాటం అవసరమని తెలిపారు.
ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్ మాట్లాడుతూ ఏ దేశ అభివృద్ధి అయినా శ్రామిక వర్గ శ్రమపై ఆధారపడి ఉంటుందని, కార్మికులు–కర్షకులు ఐక్యంగా ఉద్యమిస్తేనే అన్యాయ విధానాలను అడ్డుకోవచ్చని అన్నారు.
పలు ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ కార్మికులు సాధించుకున్న హక్కులను కాపాడుకోవాలని, ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై నిరంతర పోరాటం అవసరమని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వ విధానాలపై విమర్శలు వ్యక్తం చేస్తూ ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఆర్టీసీ, ఆటోమొబైల్, మున్సిపల్ వర్కర్స్, పోర్టర్స్ యూనియన్లు సహా అనేక యూనియన్ల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణలు జరిగాయి. కార్మిక సంఘాలను బలోపేతం చేసి ఐక్యంగా నిలవాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమాల్లో సిపిఐ ఏరియా సమితి సభ్యులు, వివిధ యూనియన్ నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని మేడేను విజయవంతం చేశారు.