ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ వార్షిక తనిఖీలు
ఏలూరు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కె. ప్రతాప్ శివ కిషోర్ బుధవారం ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీలు నిర్వహించారు. స్టేషన్కు చేరుకున్న ఎస్పీకి సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు.
ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులు, నమోదైన కేసుల దర్యాప్తు పురోగతి, వివిధ విభాగాల పనితీరును ఎస్పీ సమీక్షించారు. స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిస్థితిపై ఆరా తీసిన ఆయన, దొంగతనాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు.
ప్రజల భద్రత కోసం శక్తి యాప్ ప్రయోజనాలను విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు సీసీ కెమెరాల నిఘాను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు తరచూ పల్లె నిద్ర కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
కేసుల విచారణలో జాప్యం లేకుండా కోర్టు మానిటరింగ్ సెల్ ద్వారా వేగవంతమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులతో సమావేశమైన ఎస్పీ, క్షేత్రస్థాయిలో శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించాలని, అసాంఘిక కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అవగాహన కల్పించారు.
ప్రజలకు మరింత మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు అధికారులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని ఎస్పీ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ జయ శర్మ, డి. శ్రావణ్ కుమార్, కె. రామకృష్ణ, వి. వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.