ఏలూరులో పెట్రోల్–డీజిల్ కొరతపై సిపిఐ ఆందోళన
ఏలూరులో పెట్రోల్–డీజిల్ కొరతపై సిపిఐ ఆందోళన
ఏలూరు: నగరంలో పెట్రోల్, డీజిల్ కొరతను వెంటనే నివారించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో పాత బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆందోళన నిర్వహించారు. పెట్రోల్ బంకుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తక్షణమే పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ పరిస్థితులు ప్రారంభమైనప్పుడే దేశంలో ఇంధన కొరత వచ్చే ప్రమాదం ఉందని కేంద్రాన్ని హెచ్చరించామని తెలిపారు. కేంద్ర నిర్లక్ష్య ధోరణి కారణంగా ప్రస్తుతం ప్రజలు బంకుల వద్ద బారులు తీరాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ నిల్వలు సరిపోతాయని చెప్పిన కేంద్రం మాటలు వాస్తవానికి దూరమని ఆరోపించారు.
రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఈ సమస్యను పట్టించుకోలేదని, దాదాపు 80 శాతం బంకులు ‘నో స్టాక్’ బోర్డులతో మూసివేశారని పేర్కొన్నారు. మిగిలిన బంకుల వద్ద ప్రజలు గంటల తరబడి క్యూలలో నిలబడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్ మాట్లాడుతూ నగరంలో కేవలం రెండు మూడు బంకుల్లోనే ఇంధనం అందుబాటులో ఉందని, మిగిలినవి మూసివేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడం లేదని విమర్శించారు.
ఎఐటియుసి జిల్లా కోశాధికారి పుప్పాల కన్నబాబు మాట్లాడుతూ ఇంధన కొరత కారణంగా రవాణా రంగంపై ఆధారపడి జీవించే కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ఆటోలు లైన్లలో నిలబెట్టి ఇంధనం నింపించుకోవడానికి సగం రోజు పడుతోందని పేర్కొన్నారు.
ఈ ఆందోళనలో కురెళ్ళ వరప్రసాద్, మావూరి విజయ, గొర్లి స్వాతి, కొండేటి రాంబాబు, ఉప్పులూరి లక్ష్మి, భవాని, కొండేటి మేరీ, ఉప్పులూరి జ్యోతి, తమ్మిశెట్టి రమణయ్య, రేఖ, ఉప్పులూరి కేశవ, పూజ్య తదితరులు పాల్గొన్నారు.