ఏపీ మహిళలకు శుభవార్త.. ఇక ఏసీ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం!
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మహిళలకు అమలు చేస్తున్న స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని మరింత విస్తరించనున్నట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.
మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం, రానున్న రోజుల్లో ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు స్త్రీశక్తి పథకం ద్వారా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
ప్రస్తుతం ఈ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోందని, ఇప్పటివరకు 73.62 కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు నమోదయ్యాయని మంత్రి పేర్కొన్నారు. దీంతో మహిళల ప్రయాణ వ్యయం గణనీయంగా తగ్గిందని తెలిపారు.
అలాగే గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించేందుకు విద్యుత్ ఆధారిత ఏసీ బస్సులను కూడా ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు.
ఇక దివ్యాంగుల కోసం అమలు చేస్తున్న దివ్యాంగ శక్తి పథకానికి కూడా మంచి ఆదరణ లభిస్తోందని మంత్రి తెలిపారు.
ప్రభుత్వం అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత ఏసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించిన నిబంధనలు, అమలు తేదీలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.