ఏపీ పాఠశాలల్లో ఏఐతో హాజరు నమోదు.. గ్రూప్ ఫొటో తీస్తే చాలు అటెండెన్స్ ఆటోమేటిక్!
అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు నమోదును మరింత ఆధునికంగా మార్చేందుకు విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత ఫేస్ రికగ్నిషన్ సాంకేతికతను వినియోగిస్తూ కొత్త హాజరు విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు ప్రారంభించింది.
ప్రస్తుతం మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ ప్రాంతాల్లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఈ సాంకేతికతలో విద్యార్థుల ముఖాలను ఫేస్ రికగ్నిషన్ ద్వారా గుర్తించి, తరగతి మొత్తం కలిసి ఒక గ్రూప్ ఫొటో తీస్తే, అందులో ఉన్న విద్యార్థుల హాజరు స్వయంచాలకంగా నమోదవుతుంది.
ఈ విధానం అమల్లోకి వస్తే ఉపాధ్యాయుల సమయం ఆదా కావడంతో పాటు హాజరు నమోదులో ఖచ్చితత్వం, పారదర్శకత మరింత పెరుగుతుందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రయోగాత్మక దశ విజయవంతమైతే, ఈ విధానాన్ని త్వరలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు విస్తరించే అవకాశం ఉంది