ఏపీలో బగ్గుమంటున్న ఎండలు
ఏపీ లోని పలు జిల్లాల్లో తీవ్ర వడగాల్పుల హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్లో ఎండలు రోజు రోజుకు తీవ్రరూపం దాలుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నేడు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు.
రాష్ట్రంలోని 119 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 155 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లే ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు అవసరం లేకపోతే మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. బయటకు వెళ్లే వారు తగినంత నీరు తాగడం, తలపై గుడ్డ లేదా టోపీ ధరించడం, శరీరాన్ని చల్లగా ఉంచే ఆహార పదార్థాలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
వ్యవసాయ కూలీలు, నిర్మాణ కార్మికులు, బయట పని చేసే వారు ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ఆసుపత్రికి వెళ్లాలని వైద్య శాఖ సూచించింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలు పాటించాలని ప్రభుత్వం కోరుతోంది.