ఏపీలో పక్కా ఇళ్లు, గ్రామీణ రహదారులకు రూ.422 కోట్ల నిధులు: కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
దేశంలో ఎవరూ పూరిళ్లలో నివసించకుండా ప్రతి కుటుంబానికి సొంత పక్కా ఇల్లు కల్పించాలన్నది ప్రధాని సంకల్పమని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద 74,212 పక్కా ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వెల్లడించారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్రంలోని పలు ప్రాంతాలను 146 కొత్త రహదారులతో అనుసంధానించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాల అమలుకు కేంద్ర ప్రభుత్వం రూ.422 కోట్ల నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
ముక్కావారిపల్లెలో నిర్వహించిన సభలో మాట్లాడిన ఆయన, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఎలాంటి వెనకడుగు ఉండదని, అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల విస్తరణ, పక్కా గృహాల నిర్మాణం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని కేంద్రమంత్రి పేర్కొన్నారు.