ఏపీలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్పై కేసు నమోదు
ఏపీలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్పై కేసు నమోదు
విశాఖపట్నం: ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్పై విశాఖపట్నంలో పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాహుల్ సిప్లిగంజ్తో పాటు మరో 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. బెదిరింపులు, సైబర్ వేధింపులు తదితర ఆరోపణలతో ఈ కేసు నమోదైనట్లు సమాచారం.
ఫిర్యాదులో యువతి చేసిన ఆరోపణల ప్రకారం.. కర్పూరపు రాహుల్ రెడ్డి తనను వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని పేర్కొంది. అనంతరం తన వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను ఉపయోగించి బ్లాక్మెయిల్ చేసినట్లు ఆరోపించింది. ఈ వ్యవహారం తీవ్రరూపం దాల్చడంతో తాను ఇబ్బందులకు గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
ఈ వివాదంలో రాహుల్ సిప్లిగంజ్ జోక్యం చేసుకుని తనను బెదిరించారని కూడా యువతి ఆరోపించినట్లు సమాచారం. అంతేకాకుండా తనకు ఇష్టం లేకపోయినా బలవంతంగా వీడియో ప్రకటనలు ఇప్పించారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
యువతి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు రాహుల్ సిప్లిగంజ్తో పాటు మరో 11 మందిపై వివిధ ఆరోపణల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు, ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు, ఫోన్ సంభాషణలు, ఫొటోలు, వీడియోలు తదితర అంశాలను పోలీసులు పరిశీలించే అవకాశం ఉంది.
కాగా, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల వాంగ్మూలాలను పోలీసులు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. దర్యాప్తు పూర్తయిన తర్వాత అసలు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.