ఏపీలో స్థానిక ఎన్నికల కసరత్తు.. సెప్టెంబర్లో నోటిఫికేషన్!
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం వేగంగా సన్నాహాలు ప్రారంభించింది. ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో సెప్టెంబర్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి, డిసెంబర్ నాటికి మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కొత్త ఏడాదిలో కొత్త పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టేలా చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అమరావతిలో కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్, బీసీ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు, వార్డుల పునర్విభజన, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి అంశాలపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలోని 123 పురపాలక సంఘాల్లో వార్డులు, డివిజన్ల పునర్విభజన ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రక్రియ జూన్ 26 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ నివేదిక జూన్లో ప్రభుత్వానికి అందనున్నట్లు సమాచారం. ఆ నివేదిక ఆధారంగా జులైలో రిజర్వేషన్ల తుది ఖరారు చేపట్టనున్నారు.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 13,291 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఓటర్ల జాబితాలు ప్రచురించగా, ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు వేగంగా పూర్తి చేయాలని ఎస్ఈసీ లక్ష్యంగా పెట్టుకుంది.