అగ్ని ప్రమాదాల నివారణపై హైడ్రా దృష్టి.
అమీర్పేట ఘటనాస్థలాన్ని పరిశీలించిన హైడ్రా కమిషనర్
అగ్ని ప్రమాదాల నివారణపై హైడ్రా దృష్టి పెట్టింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలు రూపొందించడంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.సంబంధిత శాఖలతో ఇప్పటికే వరుస సమావేశాలు జరిగాయి.ఈ క్రమంలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది.రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన విధివిధానాలు, నియమనిబంధనల ప్రకారం హైడ్రా తదుపరి చర్యలుంటాయని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గారు తెలిపారు.గురువారం రోజున అమీర్పేట, మైత్రేయివనం పరిసరాల్లోని వెస్ట్ శ్రీనివాసనగర్లో అగ్ని ప్రమాదానికి గురైన షాపింగ్ కాంప్లెక్స్ను శుక్రవారం హైడ్రా కమిషనర్ పరిశీలించారు.అగ్ని ప్రమాదాలకు గల కారణాలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ.. పురాతన విద్యుత్ వైరింగ్, సామర్థ్యానికి మించి కరెంటు వినియోగం వల్ల తరచూ షార్ట్ సర్క్యూట్స్ ఏర్పడి అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. గురువారం అమీర్పేటలో జరిగిన అగ్ని ప్రమాదానికి పక్కనే ఉన్న మెస్కు సంబంధించి చిమ్నీల ద్వారా నిప్పురవ్వలు పడడంతో జరిగిందని..మరోవైపు షార్ట్ సర్క్యూట్ అంటున్నారు. ఈ విషయమై పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతోందన్నారు. ఇలా జరుగుతున్న అగ్ని ప్రమాదాలను నియంత్రించాలనే ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది అని అన్నారు ఎన్వోసీల జారీ,తనిఖీలు, నిబంధనలు పాటించని వారిపై చర్యలు.. ఇలా చాలా మార్పులు రానున్నాయని హైడ్రా కమిషనర్ తెలిపారు.నగరంలో చాలా వరకు భవనాలు, దుకాణ సముదాయాలకు ఫైర్ ఎన్ వోసీలు లేవని..చెక్ చేసి నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ చెప్పారు. వరద కాలువలపై నిర్మాణాల విషయంలో కూడా ప్రవాహానికి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. హైడ్రా అదనపు సంచాలకులు శ్రీ వర్ల పాపయ్యతో పాటు.. ఆర్ ఎఫ్ వో శ్రీ జయప్రకాష్, ఎస్ఎఫ్వోలు ఈ పరిశీలనలో ఉన్నారు.