అమెరికాలో పుట్టిన వారందరూ అమెరికన్లే.. ట్రంప్కు సుప్రీంకోర్టు షాక్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అమెరికా సుప్రీంకోర్టు మరో గట్టి ఎదురుదెబ్బ ఇచ్చింది. అమెరికాలో జన్మించిన పిల్లలకు జన్మతః పౌరసత్వాన్ని పరిమితం చేయాలంటూ ఆయన జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వును సుప్రీంకోర్టు కొట్టివేసింది. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం అమెరికా గడ్డపై జన్మించిన దాదాపు అందరు పిల్లలు అమెరికా పౌరులేనని అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. తల్లిదండ్రులు అక్రమ వలసదారులైనా, తాత్కాలిక వీసాలపై ఉన్నవారైనా వారి పిల్లలకు పౌరసత్వం లభిస్తుందన్న దీర్ఘకాలిక రాజ్యాంగ వ్యాఖ్యానాన్ని సమర్థించింది.
ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన తొలి రోజునే తల్లిదండ్రుల్లో కనీసం ఒకరు అమెరికా పౌరుడు లేదా చట్టబద్ధమైన శాశ్వత నివాసి అయితేనే పిల్లలకు పౌరసత్వం ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుని ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుపై సంతకం చేశారు. అయితే ఈ ఉత్తర్వు రాజ్యాంగ విరుద్ధమంటూ దిగువ కోర్టులు నిలిపివేయగా, తాజాగా సుప్రీంకోర్టు కూడా 6-3 మెజారిటీతో అదే నిర్ణయాన్ని సమర్థించింది. ఈ తీర్పుతో ప్రతి ఏడాది అమెరికాలో జన్మించే సుమారు 2.5 లక్షల మంది శిశువుల పౌరసత్వ హక్కులు రక్షించబడినట్లు న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.
ఇదిలా ఉండగా అమెరికా ఎన్నికల వ్యవస్థకు సంబంధించి మరో కీలక తీర్పును కూడా సుప్రీంకోర్టు వెలువరించింది. కాంగ్రెస్, అధ్యక్ష ఎన్నికల్లో రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులతో సమన్వయం చేసుకుంటూ చేసే ఖర్చుపై దశాబ్దాలుగా అమల్లో ఉన్న పరిమితులను ఎత్తివేసింది. దీంతో అమెరికా ఎన్నికల్లో రాజకీయ పార్టీల ప్రత్యక్ష ఆర్థిక భాగస్వామ్యానికి మరింత స్వేచ్ఛ లభించినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.