అమరవీరుల స్ఫూర్తితో ఫాసిస్టు శక్తులను ఎదుర్కోవాలి : డి హరినాథ్
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బొడ్డపాడులో నిర్వహించిన శ్రీకాకుళం అమరవీరుల 37వ వర్ధంతి సభలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్ పాల్గొని ప్రసంగించారు. అమరవీరుల పోరాట స్ఫూర్తితో మతోన్మాద, ఫాసిస్టు శక్తులకు తగిన గుణపాఠం చెప్పడమే వారికి ఇచ్చే నిజమైన నివాళి అని ఆయన పేర్కొన్నారు.
ఈ సభకు కుసుమ అధ్యక్షత వహించగా, విరసం నేత కామ్రేడ్ రివేరా, న్యూ డెమోక్రసీ నేత కామ్రేడ్ పి. ఈశ్వరరావు, జనశక్తి నేత కోనేరు రమేష్ ప్రసంగించారు. అనంతరం బొడ్డపాడులో ఊరేగింపు నిర్వహించి అమరవీరుల స్థూపాలకు నివాళులర్పించారు.
శ్రీకాకుళ ఉద్యమంలో తొలి ఎన్కౌంటర్లో పంచాది కృష్ణమూర్తి, బైనపల్లి పాపారావు, దున్న గోపాలరావు, మద్దెల నిరంజన్, రామచంద్ర ప్రధానో, శృంగవరపు నరసింహులు, తామాడ చిన్నబాబు అమరులయ్యారని సభలో గుర్తు చేశారు.
ప్రస్తుత పాలకులు “గ్రీన్ హంట్”, “అర్బన్ నక్సల్స్”, “కగార్” పేర్లతో విప్లవకారులు, ప్రజాస్వామ్యవాదులపై నిర్బంధకాండ కొనసాగిస్తున్నారని హరినాథ్ విమర్శించారు. దేశీయ వనరులను అదానీ, అంబానీలకు అప్పగిస్తూ కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొస్తున్నారని ఆరోపించారు.
ప్రభుత్వ దమనకాండకు వ్యతిరేకంగా విప్లవ శక్తుల ఐక్యత నేటి చారిత్రక అవసరమని డి హరినాథ్ స్పష్టం చేశారు.