అంబేద్కర్ జయంతి ముగింపు సభకు భారీ ఏర్పాట్లు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా నెల రోజుల పాటు ఘనంగా నిర్వహించినట్లు భారతీయ జనతా పార్టీ నాయకులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు పనతల సురేష్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.
అంబేద్కర్ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమం ఈ నెల 17 ఆదివారం విజయవాడలోని ఇందిరా గాంధీ మునిపల్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని డప్పు కళాకారులతో భారీ బహిరంగ సభ, ప్రదర్శన చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వరకు పదివేల మంది డప్పు కళాకారులతో వాయిద్య ప్రదర్శన నిర్వహించనున్నట్లు చెప్పారు.
రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, జిల్లా, మండల స్థాయి కార్యకర్తలు డప్పు కళాకారులను సభకు తరలిస్తున్నట్లు తెలిపారు. డప్పు కళాకారుల సంక్షేమం కోసం పలు డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు.
నలభై ఏళ్లు దాటిన ప్రతి డప్పు కళాకారుడికి నెలవారీ భృతి ఇవ్వాలని, బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరారు. గ్రామ పంచాయతీల్లో చాటింపు కార్యక్రమాలకు డప్పు కళాకారులను వినియోగించి వారికి నెల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
దేవాలయాల్లో జరిగే అర్చనలు, దీపారాధనలు, రథోత్సవాల్లో డప్పు కళాకారులను నియమించి నెల జీతం కల్పించాలని కోరారు. ప్రభుత్వ సంగీత విద్యాలయాలు, విశ్వవిద్యాలయాల్లో డప్పు కళను ప్రత్యేక పాఠ్యాంశంగా గుర్తించి సంబంధిత విభాగాల్లో ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
డప్పు కళాకారులకు ప్రభుత్వ గుర్తింపు పత్రాలు జారీ చేసి భద్రతా సౌకర్యాలు కల్పించాలని, డప్పు కేవలం వాయిద్యం మాత్రమే కాకుండా దళితుల ఆత్మగౌరవానికి ప్రతీక అని నాయకులు పేర్కొన్నారు. డప్పు కళాకారులకు పూర్వ వైభవం తీసుకురావడం భారతీయ జనతా పార్టీ బాధ్యతగా తీసుకుంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా పర్యటన చేస్తున్న ఏలూరు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు శ్రీకర్ బుర్రి, రాష్ట్ర సమన్వయకర్త రావూరి అశోక్ కుమార్ నూజివీడు నియోజకవర్గ పరిధిలోని చాట్రాయి మండలం ఆరుగొలనుపేట, జనార్ధనవరం గ్రామాల్లో డప్పు కళాకారులను కలిసి సభకు ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో మాగంటి శ్రీనివాస్ రావు, నాగమోహన్ శర్మ తదితరులు పాల్గొన్నారు.