అంచనాల కమిటీ చైర్మన్గా కోరం కనకయ్య బాధ్యతల స్వీకరణ
అంచనాల కమిటీ చైర్మన్గా కోరం కనకయ్య బాధ్యతల స్వీకరణ
ప్రజా అవసరాలు, రాష్ట్ర అభివృద్ధి.. నిధుల సద్వినియోగమే లక్ష్యం
తెలంగాణ శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్గా ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య బాధ్యతలు స్వీకరించారు. శాసనసభ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన అధ్యక్షతన అంచనాల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ బండా ప్రకాశ్ ముఖ్య అతిథులుగా హాజరై కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేశారు.
రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధుల కేటాయింపులు, వివిధ ప్రభుత్వ శాఖల పనితీరు, ప్రభుత్వ అంచనాలు–వ్యయాలపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా నిధులను సమర్థవంతంగా వినియోగిస్తూ, ప్రజలకు మెరుగైన పాలన, అభివృద్ధి ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ప్రజా అవసరాలు, రాష్ట్ర అభివృద్ధి, ప్రభుత్వ నిధుల సద్వినియోగమే తన ప్రధాన లక్ష్యమని అంచనాల కమిటీ చైర్మన్ కోరం కనకయ్య పేర్కొన్నారు.
సమావేశంలో కమిటీ సభ్యులు, ఎమ్మెల్యేలు పైడి రాకేష్ రెడ్డి, సుదీర్ రెడ్డి, ఎమ్మెల్సీ యదవ రెడ్డితో పాటు శాసనసభ, శాసన మండలి ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.