అప్రమత్తతే ఆయుధం.. కృష్ణాపురంలో పోలీసుల అవగాహన కార్యక్రమం
ఏలూరు జిల్లా టీ. నరసాపురం మండలం కృష్ణాపురం గ్రామంలో దొంగతనాల నివారణ, సైబర్ నేరాల నియంత్రణ, రహదారి భద్రతపై పోలీసు శాఖ ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది.
జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు, జీలుగుమిల్లి సీఐ వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో టీ. నరసాపురం ఎస్ఐ జయబాబు, పోలీసు సిబ్బంది గ్రామ ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు.
సైబర్ నేరాల విషయంలో అపరిచితుల మాటలు నమ్మొద్దని, OTP, బ్యాంకు ఖాతా వివరాలు, ATM PIN, CVV, పాస్వర్డ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని హెచ్చరించారు. నకిలీ లింకులు, సోషల్ మీడియా మోసాలు, ఆన్లైన్ పెట్టుబడుల పేరుతో జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్లైన్ లేదా సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని తెలిపారు.
దొంగతనాల నివారణ కోసం రాత్రి వేళల్లో ఇళ్ల తలుపులు, కిటికీలు బిగించి ఉంచాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. విలువైన నగదు, బంగారాన్ని భద్రంగా ఉంచడంతో పాటు సీసీ కెమెరాల ఏర్పాటు నేరాల నియంత్రణకు దోహదపడుతుందని వివరించారు.
రహదారి భద్రతపై కూడా అవగాహన కల్పిస్తూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, నాలుగు చక్రాల వాహనదారులు సీట్బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, ట్రిపుల్ రైడింగ్, అతివేగం వంటి ఉల్లంఘనలు ప్రమాదాలకు ప్రధాన కారణాలని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువత, విద్యార్థులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. "అప్రమత్తతే భద్రతకు తొలి అడుగు.. నేరాల నివారణలో ప్రతి పౌరుడు పోలీసులతో కలిసి భాగస్వామి కావాలి" అని పోలీసులు పిలుపునిచ్చారు.