అర్హులైన పాత్రికేయులందరికీ టిడ్కో గృహాలు
అర్హులైన పాత్రికేయులందరికీ టిడ్కో గృహాలు - మంత్రి ఎన్ఎండి ఫరూక్
నంద్యాల పట్టణంలోని అర్హత కలిగిన పాత్రికేయులందరికీ సొంత ఇంటి కల నెరవేరుస్తామని రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు మరియు నంద్యాల నియోజకవర్గ శాసనసభ్యులు ఎన్ఎండి ఫరూక్ తెలిపారు . పట్టణంలోని అయ్యలూరు మరియు ఎస్.ఆర్.బి.సి ప్రాంతాల్లో నిర్మించిన టిడ్కో గృహాలను పాత్రికేయులకు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు .
శుక్రవారం నంద్యాల మున్సిపాలిటీ నందు జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి ఫరూక్ విలేకరులతో మాట్లాడుతూ సమాజ హితం కోసం నిరంతరం శ్రమించే పాత్రికేయుల సంక్షేమానికి తమ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గతంలోనే పాత్రికేయుల గృహ వసతిపై ఇచ్చిన హామీ మేరకు, ప్రస్తుతం అందుబాటులో ఉన్న టిడ్కో ఇళ్లను వారికి కేటాయించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అయ్యలూరు మరియు ఎస్.ఆర్.బి.సి కాలనీల్లో ఉన్న గృహాలు ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనల మేరకు అర్హులైన ప్రతి పాత్రికేయునికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు . ఈ సువర్ణ అవకాశాన్ని పాత్రికేయులందరూ సద్వినియోగం చేసుకోవాలని, అవసరమైన దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి ఫరూక్ కోరారు. పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి తాము ఎల్లప్పుడూ ముందుంటామని, నంద్యాల అభివృద్ధిలో మీడియా పాత్ర కీలకమని ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ కొనియాడారు.