ఆగస్టు 2న రెండు కిలోమీటర్ల జాతీయ జెండా ర్యాలీని విజయవంతం చేయండి: రౌండ్ టేబుల్ సమావేశంలో పిలుపు
ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం: జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆగస్టు 2న జంగారెడ్డిగూడెంలో నిర్వహించనున్న రెండు కిలోమీటర్ల భారీ జాతీయ జెండా ప్రదర్శన ర్యాలీని విజయవంతం చేయాలని రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వక్తలు పిలుపునిచ్చారు.
టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఈ సమావేశంలో వివిధ రాజకీయ పక్షాల నాయకులు, విద్యాసంస్థలు, సామాజిక సంస్థల ప్రతినిధులు పాల్గొని ర్యాలీ నిర్వహణకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు.
ఆగస్టు 2న ఉదయం జంగారెడ్డిగూడెం బస్టాండ్ నుంచి అశ్వరావుపేట రోడ్డులోని బాయ్స్ హైస్కూల్ వరకు రెండు కిలోమీటర్ల మేర జాతీయ జెండా ప్రదర్శన ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. జంగారెడ్డిగూడెం చరిత్రలో తొలిసారిగా ఇలాంటి భారీ దేశభక్తి కార్యక్రమం జరుగుతోందని, రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద జాతీయ జెండా ప్రదర్శనగా ఇది నిలిచే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సహకరిస్తున్న విద్యాసంస్థలు, ఆసుపత్రులు, సామాజిక సంస్థలు, రాజకీయ పక్షాలకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు, యువత, మేధావులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పట్టణ ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తిని చాటాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు, మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ కిషోర్ తదితర ప్రముఖులు హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వెంకటరమణతో పాటు వెంకటరామ్, దాకారపు కృష్ణ, పరిమి సత్తిపండు, కొండ్రెడ్డి కిషోర్, కుక్కల మాధవరావు, గురుజు ఉమామహేశ్వరి, రాజన సత్యనారాయణ, కొప్పాక శ్రీనివాస్, శీలం కృష్ణంరాజు, లయన్స్ పండు, గుమ్మడి ప్రసాద్, నంగులూరు జగత్, గంధం గోపాలకృష్ణ, ఎలికే తాతారావు, ప్రసాద్, తారిపిరెడ్డి రామకృష్ణ, శశి, జగ్గారావు, చిట్రోజు తాతాజీ, కొంచాడ ఉమాప్రసాద్, వలవల తాతాజీ, తూటికుంట రాము, తన్నీరు రామకృష్ణ, కత్తుల విష్ణు, వెలగల సత్యనారాయణ, నాగసూరి బాలసుబ్రహ్మణ్యం, వివిధ విద్యాసంస్థలు, సామాజిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.