తిరువూరు బోసుబొమ్మ సెంటర్లో హాస్పిటల్ వ్యర్థాల సమస్య
తిరువూరు: రోగులకు వైద్యం.. స్థానికులకు రోగాలా బోసుబొమ్మ సెంటర్లో హాస్పిటల్ వ్యర్థాలతో నరకయాతన ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలోని బోసుబొమ్మ సెంటర్ పరిసర ప్రాంతాల్లో హాస్పిటల్ వ్యర్థాల సమస్య స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. పలు హాస్పిటళ్లకు సంబంధించిన వాడి పారేసిన వస్తువులను అక్కడే వదిలేస్తుండటంతో పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా మారుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటల్ వ్యర్థాలను మూగజీవాలు చిందరవందర చేయడంతో పరిస్థితి మరింత అధ్వానంగా మారుతోందని చెబుతున్నారు. వ్యర్థాల కారణంగా దుర్వాసన వెదజల్లడంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ఇబ్బందిగా ఉందని స్థానికులు వాపోతున్నారు. ఏళ్ల తరబడి ఈ సమస్య కొనసాగుతున్నా శాశ్వత పరిష్కారం కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యపై సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోగులకు వైద్యం అందించాల్సిన హాస్పిటళ్ల నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా తమ ఆరోగ్యమే ప్రమాదంలో పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆరోగ్య భద్రతపై అధికారుల పర్యవేక్షణ ఎక్కడుందని ప్రశ్నిస్తున్నారు. హాస్పిటళ్లకు వచ్చే రోగుల పరిస్థితి ఏమో కానీ, హాస్పిటల్ వ్యర్థాల కారణంగా తామే రోగాల బారిన పడే పరిస్థితి ఏర్పడిందని స్థానికులు అంటున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి బోసుబొమ్మ సెంటర్ పరిసరాల్లో హాస్పిటల్ వ్యర్థాలను వదిలేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సమస్యను పరిష్కరించకపోతే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే విధంగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని, వ్యర్థాల నిర్వహణపై క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.