తిరువూరు మున్సిపాలిటీలో ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల
అభ్యంతరాలు, మార్పులు ఉంటే సెప్టెంబర్ 17లోగా తెలియజేయాలి
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని తిరువూరు పురపాలక సంఘం ఎన్నికల నిర్వహణకు సంబంధించి వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేసే ప్రక్రియలో భాగంగా అధికారులు ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 8 నుంచి 12వ తేదీ వరకు ఐదు రోజులపాటు వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల వివరాలను పరిశీలించిన అనంతరం ముసాయిదా జాబితాను సిద్ధం చేశారు.
సెప్టెంబర్ 14న తిరువూరు రెవెన్యూ డివిజనల్ కార్యాలయం, తహశీల్దార్ కార్యాలయం, తిరువూరు పురపాలక సంఘం కార్యాలయాల్లో 28 వార్డులకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాలను ప్రచురించినట్లు అధికారులు తెలిపారు.
ముసాయిదా జాబితాలో తమ పేరు లేదా ఓటర్ల వివరాల్లో ఏవైనా తప్పులు, అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు ఉంటే ఫారం–2 లేదా ఫారం–3 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సంబంధిత దరఖాస్తులను సెప్టెంబర్ 17వ తేదీలోగా తిరువూరు పురపాలక సంఘం కార్యాలయంలో సమర్పించాలని అధికారులు కోరారు.
మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ప్రజలు ముసాయిదా ఓటర్ల జాబితాలను పరిశీలించి, వివరాల్లో తప్పులు ఉంటే నిర్ణీత గడువులోగా అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.